మా గోడూ జర ఇనరాదె ..

జనవరి J, 2010

తెలుగు నేల మీద గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఉద్యమాలకు ఇప్పటికీ తెర పడేటట్టు లేదు. రాజకీయ అభిప్రాయాలకు వేదికగా ఈ బ్లాగును వాడకూడదనుకున్నప్పటికీ తెలంగాణ వాదనకు అసలు అర్థమే లేదన్నట్టు, అసలు సమస్యే లేనట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడానికి ఈ విషయం మీద నోరు మెదపక తప్పడం లేదు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల వెనుక వాస్తవాలను వివరుస్తున్నామంటూ ప్రకటించే బ్లాగులు కోకొల్లలు. ఐతే ఎవరి వాదాన్ని వారు వినిపించి అదే సత్యమని నిరూపించడానికి అంకెల గారడీ చేయటం, తిమ్మిని బమ్మి చేసి చూపించడం ఇంటర్నెట్ మీద పరిపాటైపోయింది. రాజకీయ, ఆర్ధిక, సామాజిక రంగాలన్నిటినీ ప్రభావితం చేసే ఒక పెద్ద మార్పును ప్రతిపాదించినప్పుడు దాని వల్ల లబ్ది పొందేవారికి, దాని వల్ల కొన్ని ప్రయోజనాలు కోల్పోయేవారికి ఘర్షణ జరగడం సహజం. నిజంగా నిబద్దత గలవారు అటువంటి పరిస్తితుల్లో తమకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా న్యాయం వైపు నిలబడతారు. అందుకు కావలసిన ధైర్యం బహుషా చాలా మంది తెలుగు వారికి ఇంకా సమకూరినట్టు లేదు. అసలు ఈ సమస్య మూలాలను గమనిస్తే సంస్కృతి, భాషల మీద అవగాహన లేకపోవటం, సహశీలత లోపించడం, పక్కవారిని ఓర్వలేకపోవటం లాంటి (శ్రీ శ్రీ గారి మాటలు అక్షర సత్యాలు .. ఇది మనకు పుట్టుకతో వచ్చిన లక్షణం) లక్షణాల వల్ల తెలుగు జాతి ఎంతగా నష్టపోయిందో అర్థం అవుతుంది. తెలంగాణ పుట్టి పెరిగిన వాడిగా నేను గమనించిన కొన్ని వాస్తవాలను, ఈ సమస్యకు మూలమని నేను భావించే అంశాలను నిష్పాక్షికంగా ఇక్కడ వివరిస్తాను.

అ) ఏది తెలుగు? : భాషలు భౌగోళిక, సామాజిక కారణాల వల్ల ఎలా రూపాంతరం చెందుతాయో అర్థం చేసుకోకుండా తెలంగాణా యాసను, సంస్కృతిని కించపరచటం చాలా మంది తెలుగువారికి అలవాటే. ఈ జబ్బు ప్రధానంగా స్వచ్చమైన తెలుగు మాట్లాడతామని చెప్పుకొనే కొన్ని ప్రాంతాల వారికి మరీ ఎక్కువ. అసలు స్వచ్చమయిన తెలుగు ఇదీ అని చెప్పడానికి సరైన ఆధారం లేనప్పుడు ఇటువంటి భాషామదాంధులకు ఇటువంటి భావాలు ఎందుకో అర్థం కాదు. మన రాష్ట్రంలో యాస, మాండలికాలు ప్రతి జిల్లాలోను వేరు వేరుగా ఉంటాయన్నది కాదనలేని సత్యం. భౌగోళిక, సామాజిక పరిస్తితుల దృష్ట్యా మనుషుల అవసరాలకు అనుగుణంగా భాష, సంస్కృతి మారాయి. అటువంటి సహజ సిద్దమైన మార్పులకు స్వచ్చత పేరుతో స్థాయిని అంటగట్టడం మూర్ఖత్వం. ఇన్ని రూపాంతరాలలో నిజమైన తెలుగు ఏది అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం ఉంటుందని అనుకోవడమే తప్పు. స్వచ్చత, రిఫైన్మెంటు లాంటి భావాలకు బానిసలమయ్యి మనకు ఎబ్బెట్టుగా అనిపించిన ప్రతిదానిని ద్వేషించడం విజ్ఞుల లక్షణం కాదు. మన పూర్వికులు ఇదే పని చేసి ఉంటే ‘తర్వాతి నాలుగు నెలలు చలి కాలం’ అని చెప్పటానికి ‘తదుత్తరమాస చతుష్టయంబు హిమ సమయంబు ‘ అని సామాన్యుడికి అర్థం కాని భాషలో చెప్పిన కోలా శేషాచల కవి వంటి వాళ్ళ సాహిత్యాన్నే ఇంకా అగచాట్లు పడుతూ ఆస్వాదించాల్సి వచ్చేది. గురజాడ, వీరేశలింగం వంటి సంస్కర్తలు మనలేకపోయేవారు.

భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం ఆంద్ర రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకంటే ఎక్కువగా పక్క రాష్ట్రాల సరిహద్దుల్ని ఆనుకొని వుంది. దీని వల్ల భాష ఎక్కువగా మార్పు చెందిన మాట వాస్తవమే. ఉర్దూ పదాలు ఎక్కువగా ప్రవేశించినంత మాత్రాన నిజాముల వల్ల పర భాష చేతిలో మన భాష అపవిత్రమైపోయిందనుకుంటే, ఎక్కువ శాతం సంస్కృత పదాలను అప్పు తెచ్చుకొని ద్రావిడ భాష అని చెప్పుకొనే తెలుగు భాష ఏ మేరకు పవిత్రమైనది? అదే భాషలో ద్రావిడ సంగీత సంపదకు తలమానికమైన పంచరత్న కీర్తనలు లేవా? .. ఈ కారణం చేత కర్ణాటక సంగీతకారులు ఆ గేయాలను చిన్నచూపు చూస్తున్నారా? ‘కర్ణానికి ఇంపయింది కర్నాటక సంగీతం’ అంటారు మన మంగళపల్లి బాలమురళికృష్ణ గారు .. స్వచ్చత, శాస్త్రీయత పేరుతో సంగీతాన్ని కట్టిపడేయెద్దు అంటారాయన. భారత దేశమే భిన్న సంస్కృతులను అక్కున చేర్చుకొని తన ఔన్నత్త్యాన్ని చాటింది. ఆ విశాల దృక్పథం లేని స్వచ్చత భాండశుద్ధి లేని పాకం లాంటిది .. తినడానికి ఎలా వున్నా దాని వల్ల అనర్థాలు తప్పనిసరి. అటువంటి విశాల దృక్పథం తెలుగు వారందిరికి అలవడుతుందని, తమకు నచ్చనిదల్లా హేయమైనదని నమ్మే సంకుచిత దృక్పథం గలవారికి కనీసం ఇప్పుడైనా కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం.

గమనిక : నిజానికి గోదావరి జిల్లాల ‘అలాగ, అండీ, ఆయ్’ భాషనీ, శ్రీకాకుళం ‘ఏటయినాది, పోనాది, గందా’ భాషనీ ఇదే రకంగా చూస్తామని నాకు తెలుసు. ఐతే ఈ సమస్య తెలంగాణ యాస విషయంలో మరీ ఎక్కువ. వికృతి పదాలు ప్రవేశించిన భాషని వాడడానికి మనకు నామోషి .. వాడిన వాడిని ‘ఊరోడు’ అని కించపరుస్తాం .. అదే ఇంగ్లీష్ స్లాంగ్ ని మాత్రం ‘కూల్’ అనేస్తాం .. ‘ఫక్/షిట్’ లాంటి పదాలు ఊతపదాలు అయిపోతాయి. మన పాఠ్య పుస్తకాలలో, సాహిత్యంలో, సినిమాలలో అన్ని యాసలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవటం ఇందుకు పాక్షిక కారణం కావచ్చు. ఆ లోపాన్ని శక్తి మేరకు నిర్మూలించడానికి తెలుగు యువ కిశోరాలు ప్రయత్నించగలరని మనవి.

ఆ) ప్రగతిశీలత ? : తెలంగాణా ప్రాంత వెనుకబాటుకు మా తప్పేమిటి అని బయటి వారు ప్రశ్నించటంలో తప్పు లేదు. కాని వారి వెనుకబాటుతనానికి వారే కారణం, విభజన వల్ల అసలు వారికి ప్రయోజనమే లేదు అనటం వాస్తవాలను విస్మరించడమే. ఇలా వాదించేవారు తరచుగా తెలంగాణా వారిని అందరినీ ఒకే గాట కట్టి ‘వాళ్ళు కష్టపడరండీ!!’ అనడం చాలా సార్లు చూసాను. అసలు అటువంటి వ్యాఖ్యలోనే వారికున్న దురుద్దేశం కనిపిస్తుంది. కష్టపడే తత్వం, తెలివి ఒకరి సొత్తు కాదు. నిజాముల నుండి వారసత్వంగా సంక్రమించిన నవాబీ అలవాట్ల వల్ల మొదట్లో ‘కౌలు సంస్కృతి’ ని చాలా మంది తెలంగాణా రైతులు పాటించిన మాట వాస్తవం. కాలక్రమంలో వారి అలవాట్లు మారాయి .. తమ భూమిని వాడుకొని పైకి ఎదిగిన బయటి వారినుండి చూసి నేర్చుకొన్నారే తప్ప వారి మీద పడి దోచుకోలేదు. విద్యారంగంలో సైతం క్రమంగా చాలా మెరుగుదల జరిగింది. జరిగిన తప్పును సరిదిద్దుకొని ప్రగతి వైపు సాగే ప్రయత్నంలో భాగమే ఈ రోజు ఈ విభజన డిమాండు.

విభజన ఎందుకంటారా? దైవదత్తమైన ప్రకృతి/జల సంపదల పంపిణీలో తెలంగాణాకు అన్యాయం జరిగిందన్నది ఎవరూ కాదనలేని సత్యం .. అది జరిగిన రోజు ఇక్కడి ప్రజలు విద్యాపరంగా వెనకబడటంవల్లనో, ఇక్కడి రాజకీయ నాయకుల చేతగానితనంవల్లనో ఇది జరిగి ఉండవచ్చు .. కాని దాంతోపాటు తెలిసీ అటువంటి అన్యాయాన్ని దగ్గరుండి జరిపించిన ఆంద్ర నాయకుల పాపమూ ఉంది. ఇందులో ఆంద్ర ప్రాంత ప్రజల తప్పు లేకపోవచ్చు .. కాని ఇప్పటికి ఆ తప్పు సరిదిద్దవద్దనటం భావ్యం కాదు. అలాగే విద్యాపరంగా వెనుకబడిన పాపానికి తెలంగాణాకు జరిగిన నష్టం రోజు రోజుకూ మరింత ఎక్కువవుతున్నదే తప్ప తగ్గడం లేదు. విద్య వల్ల ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగాలు, డబ్బు, స్థాయి .. వాటి వల్ల అధికారం .. దాని వల్ల మరింత ప్రగతి సాధించే అవకాశం .. ఇవన్నీ ఎల్లకాలమూ ఆంధ్ర ప్రాంత ప్రజల చేతిలోనే అధికంగా ఉండిపోయే ప్రమాదం కచ్చితంగా ఉంది. (నేను ఇక్కడ ఆంధ్ర వారిని తప్పుబట్టడం లేదు .. విద్యలోని అంతరాల వల్ల మిగిలిన అంతరాలు ఎలా పెరిగాయో/పెరుగుతున్నాయో వివరిస్తున్నాను) . అటువంటి అంతరాలు తగ్గించడానికి తెలంగాణా ప్రాంత అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక విధానాలు ప్రభుత్వం చేపట్టాలి, ఇక్కడి విద్యావ్యవస్థను పటిష్టం చేసి, ప్రభుత్వ ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం కలిగించాలి. (ఉద్యోగాలలో ప్రాతినిధ్యం మాట కొందరికి మింగుడు పడదు .. ఇందులో ప్రతిభకు అన్యాయం జరుగుతుంది అని వాదించడంలో పైకి న్యాయం కనిపించినా తమ ఉద్యోగాల్లో కోత ఉంటుందనే భయం వ్యతిరేకతకు ప్రధాన కారణం .. ఇందాక చెప్పినట్టు మనకు నష్టం జరిగినా న్యాయం వైపు మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి .. అది లేనప్పుడు ఈ వాదనను వ్యతిరేకించడానికి సవా లక్ష కారణాలు వెతకవచ్చు .. వాటిలో నిజాయితీ మాత్రం ఉండదు. రిజర్వేషన్ల మాదిరే ఇదీనూ!!). పైన చెప్పిన అభివృద్ధి పనులకు కావలసిన నిధులు, రాజకీయ ప్రక్రియ సమైక్య రాష్ట్రంలో సాధ్యం అయ్యే అవకాశం తక్కువ. ఒక వేళ అలా జరిగినా అవి సరిగా అమలు జరగవు అన్నది చరిత్ర నేర్పిన పాఠం. ఇందు వల్ల విభజన అవసరం.

ఇది అభివృద్ధి కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఒక ప్రాంత ప్రజలు చేస్తున్న కన్నీటి పోరాటమే కాని మరొకరి మీద అక్కసుతోనో, వారి ఆస్తుల మీద ఆశతోనో చేస్తున్న పోరాటం కాదు.

ఇ) మరి ఆస్తుల మాటో? : హైదరాబాదుకు అన్ని ప్రాంతాల ప్రజలు చేసిన మేలుని, వలస వచ్చిన వారు తెలంగాణా ప్రాంత అభివృద్ధికి పాటుపడిన విషయాన్నీ ఎవ్వరూ విస్మరించలేరు .. ఐతే విభజన కోసం జరిగిన ఉద్యమంలో కొందరు నీతి లేని నాయకులు ఉద్యమం ఎలా నడపాలో తెలియక ‘తరిమేస్తాం, కాలుస్తాం, కూలుస్తాం’ అని బయటి వారిలో భయాన్ని, తెలంగాణాలో ప్రజల్లో బయటివారి మీద ద్వేషాన్ని నింపిన మాట వాస్తవం. అటువంటి వారి చేతిలో ఉద్యమం పక్క దారి పట్టకుండా చూడవలసిన బాధ్యత తెలంగాణా మేధావుల మీద ఉంది. అలాగే ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గుర్తించి విభజన ప్రక్రియకు సహకరించిడం బయటి వారి బాధ్యత. అభిప్రాయాలు చెప్పినందుకు ఒకరిని హింసించడానికో, ఈ భూమి మాది అని మరొకరిని తరమడానికో మన రాజ్యాంగమే అంగీకరించదు. ఉద్యమం హింసాత్మకంగా మారడాన్ని వివేకవంతులెవరైనా వ్యతిరేకిస్తారు. ఐతే ఇది సమైక్య ఉద్యమానికి కూడా అంతే వర్తిస్తుంది. తెలంగాణా ఆవిర్భావం వల్ల కేవలం పరిపాలన, రాజకీయ మార్పులు తప్ప మరే అవాంచిత సంఘటనలు జరగవన్నది నా నమ్మకం. అటువంటి భయాలను తొలగించే బాధ్యత ఉద్యమకారులదే!! (ఈ విషయమై నేను అనేక మంది మేధావులకు, విద్యార్థులకు లేఖలు వ్రాసాను. అందరూ ఇందుకు అంగీకరించారేగాని కాదంటూ విషం కక్కలేదు).

తెలుగు వారంతా బందులు, ఆత్మహత్యలు మాని భారత ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ మీద నమ్మకముంచి దానికి అందరూ సహకరించవలసిన సమయమిది. విశాల హృదయాలతో ఆ ప్రక్రియ అనివార్యమయిందని సీమాంధ్ర ప్రజలు, అందులో భాగంగా అందరి మాట వినవలసిన అవసరం ఉందని తెలంగాణా ప్రజలు గుర్తిస్తారని, ఆ ప్రక్రియ జరిగే సమయాన్ని తిరిగి తెలుగు నేలను అభివృద్ది వైపు నడిపించడానికి ఉపయోగిస్తారని ఆశిద్దాం.

ఏడికి బోతవ్, బిడ్డా!!

జనవరి J, 2010

“ఈ రాష్ట్రమేదో తొందరగా ఇచ్చేస్తే బావుండును .. ఈ గొడవలతో యాష్టకొస్తుంది!! మొన్న నరసారెడ్డి సారు దీక్షకు కూర్చోబోతే ‘నువ్వు ఒక రోజు స్కూల్ బందు పెట్టమంటే నసిగావు. నువ్వు ఆంధ్రోడివి .. నీ దొంగ దీక్ష అవసరం లేద’ ని పంపేసారట. ఇలా సపోర్ట్ చేసే వాళ్ళని నారాజ్ జేసి వెనక్కి పంపితే ఎట్లా!!” .. అమ్మ గొంతులో ఉన్నది బాధో అసహనమో తెలియలేదు. ఆమె భాషలో అలవాటుగా దొర్లిన ఇక్కడి పదాలు మాత్రం ఆమె అవస్థకు అద్దం పడుతున్నాయి. అమ్మ పుట్టి పెరిగింది మా జిల్లా (నిజామాబాదు) లోనే .. చదువు వరంగల్ లో .. తన పూర్వికుల ప్రాంతమని చెప్పుకొనే కృష్ణా జిల్లా ఎలా వుంటుందో కూడా తెలియదు తనకి (అమ్మకు ముందు మూడు తరాల క్రితం వచ్చారిక్కడికి వాళ్ళు). ఇక్కడికి తరలి వచ్చిన చాలా మందిలానే భాష, యాస మారకపోయినా ఇక్కడి నేలతో ఉన్న అనుబంధం ఆమెలో స్పష్టం గా కనిపిస్తుంది.

“ఎన్ని ఉద్యమాల్లో మనం పాల్గొన్నా మన పరిస్థితి ఇంతేలే .. భాష కాకపోతే ఇంకొకటి పట్టుకొని వేరు చేస్తారు!! పుట్టి పెరిగిన నేలలోనే బయటి వాళ్ళం అవ్వాల్సి వస్తోంది. ఎక్కడికైనా వెళ్ళిపోదామా అంటే మనది అనదగ్గ చోటే లేదు. విజయవాడలో ఒక పూట తిండి పెట్టేవాడు లేదు. ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా ఎలా ఉన్నారని ఒక్క ఫోన్ చెయ్యలేదు మన బంధుగణం. మళ్లీ ‘నైజామోళ్ళు’ అని ఒక బిరుదు మనకి. అయినా దోస్తులు, పార్ట్నర్లు ఇక్కడి వాళ్ళు ఐతే ఇక ఎక్కడికని వెళతాం” .. నాన్న మాటల్లో అంత నిర్లిప్తత నేనెప్పుడు చూడలేదు. ఎంత తెలంగాణ మీద మమకారం ఉన్నా ఇలాంటప్పుడు ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయం ఎప్పుడు ఉండేదే ఆయన మనసులో. నాన్న చెన్నారెడ్డినాటి ‘జై తెలంగాణ’ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న మనిషి. ఆయనకు బహుషా అమ్మకన్నా ఎక్కువ బాధ ఉంది కాబోలు. వాళ్ళ దగ్గర ఉండి చూసుకోలేను కనుక నాకూ కొంత భయమే.

“మనం ఇక్కడి వాళ్ళమని అందరికి తెలుసులే నాన్నా!! మరీ ఎక్కువగా గొడవలైతే షిఫ్ట్ అవుదాంలే!!” నాకు నేను ధైర్యం చెప్పుకునేందుకు ప్రయత్త్నిస్తూ నాన్నతో అన్నాను.

మా మాటలు వింటున్నాడు కాబోలు పెరుమాండ్లు తాత వాకిట్లోంచి ఇంట్లోకి వచ్చాడు .. ” ఈ పెరుమాండ్లు ఏమి కీడు చేసిండని ఎల్లిపోతవు బిడ్డా!!” గద్గద స్వరంతో నాన్నతో అన్న ఆ ఒక్క మాటలో ఎన్నో భావాలు .. నాన్నకు, ఆయనకు కళ్ళలో నీళ్ళే తక్కువ!!

ఆంద్ర రాష్ట్ర అవతరణకు ముందు వలస వచ్చిన మా తాతయ్యకు, పెరుమాండ్లు తాతకు స్నేహం ఎలా కుదిరిందో నాకూ తెలియదు గాని నాకూ ఊహ తెలిసిన దగ్గరి నుండి తాతయ్య, తాత ఇద్దరూ ఒక్కటే మా ఇంట్లో. మా ఇళ్లూ పక్క పక్కనే. నాన్న తాతను పేరుకు కాకా అని పిలిచినా సొంత చిన్నాన్నలా చూసేవాడు. తాతయ్య, తాత ఇద్దరూ మాట్లాడుకునే పిచ్చాపాటి మాటలు నేను శ్రద్దగా ఆలకించేవాడిని. కాలక్రమంలో తాతయ్య ముందు నిష్క్రమించారు. పెరుమాండ్లు తాత కొడుకులు బ్రతుకు సమరం కోసమని వేరే ఊళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. తాత, నర్సవ్వ ఆయికి జీవిత చరమాంకంలో ఆప్యాయతన్నది కరువయ్యింది. అందుకే కాబోలు నాన్నను బిడ్డా అని పిలుచుకొంటాడు. మనుషుల మధ్య కులం, భాష, సంస్కృతిలాంటి గోడలు ఎందుకు ఉన్నాయా అనిపిస్తుంది వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు.

“అది గాదె తాత!! ఈడ లొల్లి పెద్దగ ఐతే నాయినకు తక్లీఫ్ ఐతది .. నేను దూరం ఉంటి!! .. రెండొద్దుల దాక ఈడ లేకుంటే .. అన్ని మంచిగయినంక మల్ల పంపిస్త” తాత బాధపడుకుండా చెప్దామని ప్రయత్నించాను.

“నీ బోటి బిడ్డలు మా ఇంట లేకపోతిరి .. మూలకు పారేసి, ఇన్ని పైసలు ఇచ్చి ఎవ్వని దారి ఆడు బట్టిండు!!” అన్నాడు పెరుమాండ్లు తాత ” ఐన బిడ్డా .. ఈడ తెలంగాణ మందిల మీ నాయినకున్న పేరు ఎవ్వనికి లేదు, లొల్లిలు ఐతే పాతూరుకెల్లి మీ నాయిన దోస్తులు ఉరికి రారు? నేను ఈడనే ఉన్న .. నీకు ఫికరేమిటికి? “. తాతకున్న నమ్మకం వాస్తవానికి దగ్గరగా ఉంటే ఎంత బావుండు అనుకున్నా నేను.

“లొల్లి ఐనప్పుడు గవన్ని ఎవ్వనికి యాదుండయి తాత .. ఆగం చేసెటోల్లు మనకి యాడ ఇంటరు” మనసులో భయం చెప్పాను.

ఈ సరి సమాధానం ఆయి ఇచ్చింది “ఇంద్ల యాదుండనీకి ఏమున్నది !!.. మీ తాత ఈడికి అచ్చినప్పుడు ఇదే లొల్లి నడుస్తుండె .. గిప్పుడు రెండు తరాలు నడిసిపాయె .. మా బిడ్డలలెక్కనే మీ నాయిన, నువ్వు ఈడనే మా కండ్ల ముందు పెద్దగ అయ్యిండ్రు!! మిమ్ములను ఎల్లగొడితే తెలంగాణ తల్లి పేగు దెంచినట్టుగాదు?”.

అందరు మౌనంగా ఉండిపోయారు .. ఆమె మాటకు సమాధానం మా దగ్గర లేదు మరి !!

… ఒక వెనుకబడిన ప్రాంతపు పోరాటాన్ని.. ప్రాంతీయ విద్వేషాగ్నిగా, ఒక మహానగరం కోసం కీచులాటగా మార్చిన మన నేతలకు నిజంగా సామజిక స్పృహ ఉందో లేదో నాకూ తెలియదు.. పెరుమాండ్లు తాతకున్న మానవీయ విలువలు, ఆయికి ఉన్న వివేకం వారికి ఉంటే ఈ పాటికి తెలంగాణ చాలా ముందు ఉండేది. కనీసం ఇప్పుడైనా అది జరుగుతుందని నా ఆశ.

గమనిక : నేను తెలంగాణ మద్దతుదారుని (మాత్రమే). పుట్టిన నేల అభివృద్ధిని కాంక్షించడం చాలా సహజం, న్యాయం. దయ చేసి నా అభిప్రాయాలను ఏ ప్రాంతానికి (ముఖ్యంగా ఆంద్ర, రాయలసీమ) వ్యతిరేకమని అర్థం చేసుకోవద్దని మనవి. ఈ కథ తెలంగాణ ప్రాంతంలో చాలా ఏళ్లుగా ఉంటూ భాష వల్ల వేరుగా చూడబడుతూ, అలాగని పుట్టిన నేల మీద ఇష్టాన్ని చంపుకోలేక, మరొక చోటికి వెళ్ళలేక .. వివక్షకు అభిమానానికి మధ్య నలిగిపోతున్న ఒక అల్ప సంఖ్యాక వర్గం ( వారిని సెటిలర్లు అని ఒక పదంతో పిలుస్తుంటారు .. నాకా పదం నచ్చదు కాబట్టి వాడలేదు) పడుతున్న అవస్థను, తెలంగాణ వాసుల మధ్యనున్న సున్నితమైన సామాజిక బంధాలను చిత్రీకరించటానికి చేసిన ప్రయత్నం. దయ చేసి తిట్లు, శాపాలు, రాజకీయ అభిప్రాయాలు వంటివి వ్యక్తీకరించడానికి కామెంట్స్ ను వాడవద్దు. నిష్పాక్షిక అభిప్రాయాలు, విమర్శలు వగైరాలకు స్వాగతం

తెలుగు కంప్యూటర్ భాషకై పోరాటం

జనవరి J, 2010

ఈ ప్రయత్నం మొదలెట్టి ఒక వారం గడిచిపోయింది .. ఇంకొక వీకెండ్ అన్నమాట .. బొత్తిగా ఏ అడ్వెంచర్ లేదండి జీవితంలో !! ఒక్కోసారి ఈ ఉద్యోగం వదిలేసి ఒక తెలుగు కల్చర్ పార్టీ పెట్టి .. సి/సి ++/ పర్ల్ .. లాంటి కంప్యూటర్ భాషలన్నీ తెలుగు పదాలు వాడాలని నిరహారదీక్ష చేద్దామని ఆలోచిస్తున్నా :D . ఈ మధ్య ప్రతి దానికి ఈ దీక్షలు మొదలెట్టేయడం ఫ్యాషన్ కదా !!..   అప్పుడు గాని మన ప్రోగ్రాముల బోర్ తగ్గదు .. ఫర్ ఎగ్జాంపుల్ .. మా నిజామబాద్ భాషలో ఒక చారిత్రిక ప్రాధాన్యత గల ప్రోగ్రాం ఇలా ఉంటుంది ..

#దించు "రాతగీత.త"
మొదలు( ఏమద్దు  )
{
     చేతనైతే చెయ్యు ()
    {
         అచ్చెయ్యి ("నమస్తే, దునియా!");
    }
    కాకుంటే
    {
         అచ్చెయ్యి (" నాతోని అయితలేదు .. ఏడనో తప్పు అయినట్టుంది!");
    }
    అయిపొయింది 0;
}

.. అలాగన్న మాట!!

మా గర్జన :  పైన  వ్రాసిన ప్రోగ్రాం కేవలం వినోదానికి  మాత్రమే .. కమర్షియల్/వ్యాపార నిమిత్తము వాడరాడని గమనిక/హెచ్చరిక/మనవి .. ఒక వేళ వాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని గుర్తించగలరు .. అటువంటి వెన్నుపోటులను మేము తీవ్రంగా ఖండిస్తాం .. అటువంటి మోసకారులను జాతి క్షమించదు .. చరిత్ర హీనులైపోతారు!!
( తెలుగు పొలిటికల్ స్పీచ్ ప్రాక్టీస్ చేస్తున్నాలే .. ఈ మధ్య ఈ పదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి వాటిలో !!).

స్వాగతం

జనవరి J, 2010

స్వధర్మాన్ని ఆచరిస్తూ మరణించినా మేలని ఘంటశాలగారి మధుర స్వరంతో పాడిన భగవద్గీత కొన్ని వందల సార్లు విని వుంటాను!! సాఫ్ట్వేర్ ఉద్యోగం వెలగబెడుతూ దేశ రాజధానిలో ఉన్నా తెలుగు భాష మీద మమకారం మాత్రం చావలేదు. ఆ పై తెలుగు సాహిత్య విప్లవమొకటి లేదని చానాళ్ళ నుంచి బాధ. ఇక ఇలా కాదని .. మనమే రంగప్రవేశం చేయాలని నిర్ణయించా!! కనీసం సమయం దొరికినప్పుడు కొంత మన సాహిత్య, సాంస్కృతిక సంపదలను శక్తి మేరకు నెమరు వేసుకుందామని ఈ బ్లాగ్ మొదలు పెట్టాను.  తెలుగు ప్రజలు, సాహిత్యం, సంస్కృతి, రాజకీయాలు, సినిమాలు వగైరాలే కాక ఇతర అంశాల మీద కూడా తెలుగులో బ్లాగ్ చేయాలన్నది ఆశయం!! కొందరు తెలుగు మిత్రులను కూడా ఆహ్వానిస్తున్నాను. మీరు తెలుగు వారయితే దయ చేసి తెలుగు లిపిలో మీ అభిప్రాయాలు తెలుపగలరు. “వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా!!” అని గుర్తించగలరు .. కాబట్టి ఏ మాండలికంలోనైనా రాయవచ్చు!! ఆంధ్రులు ఆరంభశూరులని ఒక పెద్ద నింద ఏడిచింది మన మీద. కాబట్టి ఈ ప్రయత్నం అలా కాకూడదని ఆశిస్తున్నా!!


Follow

Get every new post delivered to your Inbox.